తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

  • తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఓటింగ్
  • ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్
  • సాయంత్రం 4 గంటలకు ముగిసిన వైనం
  • 4 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం
తెలంగాణలో రెండు స్థానాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. సాయంత్రం 4 గంటల సమయానికి క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి నేడు పోలింగ్ జరగ్గా... అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా మొత్తమ్మీద పోలింగ్ ప్రశాంతంగానే సాగింది.

పలు పోలింగ్ బూత్ ల వద్ద కాసేపు ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారంటూ సీపీఐ ఆరోపించింది. ఈ సందర్భంగా సీపీఐ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇక, నల్గొండ జిల్లా ఎన్జీ కాలేజ్ లో ఏర్పాటు చేసిన బూత్ నెం.30లో బీజేపీ ఏజెంటుపై టీఆర్ఎస్ నేతలు చేయిచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఐడీ కార్డు లేకుండా ఏజెంటుగా ఎలా కూర్చుంటావంటూ టీఆర్ఎస్ నేతలు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Graduate MLC Elections
Polling
Telangana
TRS
BJP

More Telugu News